Skip to main content

మంత్రి తుమ్మల.. పైలాన్ నిర్మాణంపై సీరియస్, తొలగింపు



ఖమ్మం : రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం, మచ్చలేని ఇమేజ్ ఉన్న నాయకులను సైతం ఒక్కోసారి అనుచరుల అత్యుత్సాహం వివాదాల్లోకి నెడుతుంది. ఇందుకు ఖమ్మం నగరం వేదికైంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 40 ఏళ్ల మంత్రి రాజకీయ ప్రస్థానానికి చిహ్నంగా కొందరు ముఖ్య నాయకులు తలపెట్టిన ‘పైలాన్’ (స్తూపం) నిర్మాణం.. చివరకు ఆయనకే మచ్చ తెచ్చేలా మారడంతో అమాత్యుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న వెంటనే రంగంలోకి దిగిన మంత్రి తుమ్మల తక్షణమే ఆ పనులను నిలిపివేయించి వివాదానికి తెరదించారు. స్థానిక లకారం ట్యాంక్ బండ్ జంక్షన్ లో దేశ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహం వెనుక భాగంలో ఒక పైలాన్ నిర్మాణాన్ని కొంతమంది అధికార పార్టీ నాయకులు రాత్రి కి రాత్రి చొరవ చూపారు. ఈ నిర్మాణానికి అడ్డుగా ఉందనే సాకుతో అక్కడ ఎంతో కాలంగా ఉన్న ఒక పచ్చని చెట్టును సైతం నిర్దాక్షిణ్యంగా బలితీసుకున్నారు. మున్సిపల్ అధికారులపై రాజకీయ ఒత్తిడి తీసుకువచ్చి, నిబంధనలకు విరుద్ధంగా ఈ పనుల్లో వేగం పెంచారు. బుధవారం పైలాన్ నిర్మాణ భూమి పూజ కూడా చేశారు. యువ నేత, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అయితే, పీవీ లాంటి మహోన్నత వ్యక్తి విగ్రహం వెనుక ఈ పైలాన్ ఏర్పాటుకు యత్నించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. శుక్రవారం బ్రాహ్మణ సంఘం నేతలు కూడా అక్కడ నిరసన వ్యక్తం చేశారు. మరో వైపు చారిత్రక విగ్రహం ప్రాధాన్యతను తగ్గించేలా సాగుతున్న ఈ నిర్మాణ వ్యవహారాన్ని స్థానికులు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె,  బి ఆర్ ఎస్ ఎమ్మెల్సీ వాణీదేవి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆమె తక్షణమే స్పందించి ఖమ్మం కలెక్టర్ దివాకర్ టి.ఎస్.కు ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన కలెక్టర్.. ఈ విషయాన్ని వెంటనే మంత్రి తుమ్మల దృష్టికి తీసుకెళ్లారు. తన పర్యవేక్షణలో ఉండే నగరంలో.. తనకు మాటమాత్రంగానైనా చెప్పకుండా ఇలాంటి అనాలోచిత పనులు సాగడంపై మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేసిన‌ట్లు ప్రచారం జరుగుతోంది. విషయం తెలిసిన వెంటనే మంత్రి.. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌కు ఫోన్ చేసి, సదరు పైలాన్ నిర్మాణాన్ని తొలగించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి శనివారం ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. దేశానికి ఎనలేని సేవలందించిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వంటి మహోన్నత వ్యక్తిని కించపరిచే విధంగా లేదా తక్కువ చేసే విధంగా ఎలాంటి చర్యలు ఉన్నా సహించేది లేదని స్పష్టం చేశారు. అత్యుత్సాహంతో పార్టీకి, తనకు నెగటివ్ టాక్ వచ్చేలా ప్రవర్తించిన వారిపై మంత్రి తీవ్రస్థాయిలో మండిపడిన‌ట్లు స‌మాచారం. కార్యకర్తలు ప్రచార ఆర్భాటాలు, హంగులు మానుకుని ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని గట్టిగా హెచ్చరించినట్లు పేర్కొన్నారు.




Comments

Popular Posts

వైరా కాంగ్రెస్ లో వెన్ను పోట్లు

వైరా: ఖమ్మం జిల్లాలోని వైరా పుర పాలక ఎన్నికల సందర్భంగా అధికార పార్టీలో వెన్నుపోట్లపై ఫలితాల అనంతరం విస్తృతంగా చర్చ జరుగుతోంది. మున్సిపాలిటీలోని 7 వార్డుల్లో మూడు కాంగ్రెస్ వర్గాలు వెన్నుపోటుకు కత్తులు దూసుకున్నాయి. అయితే 3 వార్డుల్లోని కాంగ్రెస్ అభ్యర్థులు ఈ వెన్నుపోట్ల కత్తుల గాయాల నుంచి సురక్షితంగా  బయటపడ్డారు. మరో నాలుగు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు  వెన్నుపోటు రాజకీయాలకు బలయ్యారు. వైరా మున్సిపాలిటీలోని  6, 7, 9, 10, 11, 12, 15 వార్డుల్లో  వెన్నుపోటు రాజకీయం జరిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 6వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి  కాపా చంద్రకళ, 7వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పణితి సైదులు,  9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కట్ల సంతోష్, 10వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బొడ్డు త్రివేణి, 11 వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కొల్లి రమేష్,  12 వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థిని  మిట్టపల్లి కృష్ణవేణి, 15వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి  రాంపూడి రాజ్యలక్ష్మి పై వెన్నుపోట్లు రాజకీయాలు జరిగాయని ప్రచారం జరుగుతుంది.  అయితే వెన్నుపోట్ల రాజకీయాల నుంచి 6, 7, 9 వ...

ఫర్టిలైజర్ యాప్ ద్వారా యూరియా పంపిణీ.. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఖమ్మం: జిల్లాలో యూరియా పంపిణీ ఫర్టిలైజర్ యాప్ ద్వారా విజయవంతంగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో జనవరి, 29వ తేదీ నుండి  యూరియా పంపిణి యాప్ ద్వారా జరుగుతుందని, ఈ వారం రోజుల్లో 25252 మంది రైతులు 108721 యూరియా సంచులను యాప్  ద్వారా బుక్ చేసుకున్నారని, 87350 సంచులను కొనుగోలు చేయడం జరిగిందని కలెక్టర్ అన్నారు. రైతులు ఈ యాప్ ద్వారా జిల్లాలో అందుబాటులో ఉన్న యూరియాను వారి యొక్క పంట రకమును బట్టి, వారికున్న విస్తీర్ణాన్ని బట్టి జిల్లాలో ఏ డీలర్ వద్ద అయినా, ఏ సొసైటీలో అయినా అందుబాటులో ఉన్న యూరియాను బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ఒకసారి బుక్ చేసుకున్న తర్వాత 24 గంటల లోపు ఆ రైతు బుక్ చేసుకున్న డీలర్ దగ్గరికి వెళ్లి కొనుగోలు చేయవచ్చని అన్నారు. ఏదైనా పరిస్థితులలో 24 గంటల లోపు యూరియాను తీసుకోనట్లయితే ఆ యొక్క బుకింగ్ రద్దు అవుతుందని, మళ్లీ రైతులు బుక్ చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఇందులో పట్టాదారులు, పట్టా పుస్తకాలు లేని వారు, కౌలు రైతులు యూరియాను బుక్ చేసుకునే వెసులుబాటు ఉందని కలెక్టర్ తెలిపారు.  కౌలుదారులు అయితే వాళ్ళు ఎవరి దగ్గర అయితే ...

భద్రాచలం: కమనీయం రాములోరి కల్యాణం ..!

కమనీయం రాములోరి కల్యాణం ..! ఆకాశమంత పందిరి...!  భూదేవంత మండపం...! వేదగోష పరిమళాలు...! జయ జయ ద్వానాలు...! ఇది..భద్రగిరినా...!? దక్షిణఅయోధ్యపురినా...!? భక్తుల సంభ్రమాశ్చర్యాలు...! ఖచ్చితంగా 12 గంటలకు...! సాంప్రదాయ అభిజిత్ లగ్నాన...! రాములోరు సీతమ్మవారిని పరిణయం మాడారు...!  భద్రాచలంలో  శుక్రవారం జరిగిన  రాములోరి కళ్యాణం వైభోగమే...! ముగ్ధ మనోహరమే...! కనులారా తిలకించిన భక్తజన హృదయాలు ఉప్పొంగాయి...! భద్రగిరి భక్తులతో పోటెత్తింది...! భద్రాచలం:    భద్రాచలం దివ్య క్షేత్రంలో మిథిలా ప్రాంగణంలో శుక్రవారం జరిగిన సీతారాముల పరిణయ వేడుక ఆబాల గోపాలాన్ని మరిపించింది. ఆధ్యాంతం భక్తులను కనువిందు చేసింది. శుక్రవారం వేకువజామునే రామాలయంలో తొలుత అర్చక స్వాములు స్వామివారికి సుప్రభాత సేవ జరిపారు. అనంతరం నివేదన గావించారు. మూలవర్లకు అభిషేకం జరిపారు. తొలుత ఆలయంలో ఏకాంతంగా ధృవమూర్తుల కళ్యాణం  నిర్వహించారు. తదుపరి ఉత్సవమూర్తులకు అలంకారం గావించారు.  స్వామివారిని పల్లకిపై కూర్చుండబెట్టి వేదమంత్రాలు,బాజా భజంత్రీలు, కోలాట దృశ్యాలు నడుమ ఊరేగింపు నిర్వహించి స్వామివారిని మిధిలా ప్రాం...