చిరునవ్వు చిందించే కాంగ్రెస్ నేత జావీద్ ఇక లేరు.. పిల్లలమర్రి శివారులో రోడ్డు ప్రమాదంలో మృతి. పదేళ్ల బి.ఆర్.ఎస్. పాలనలో కాంగ్రెస్ కు అండగా. పదవి రాకుండానే అనంతలోకాలకు
కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర విషాదం
డిప్యూటీ సీఎం భట్టి సహా మంత్రులు పొంగులేటి, తుమ్మల దిగ్బ్రాంతి
ఖమ్మం : మహమ్మద్ జావీద్.. కరడుగట్టిన కాంగ్రెస్ వాది. మైనార్టీ నాయకుడు. అతని మోము పై ఎపుడు చిరునవ్వే ఉంటుంది. పదేళ్ల టీ(బి).ఆర్.ఎస్. పాలనలో కాంగ్రెస్ జెండా విడువలేదు. అంతేగాక పార్టీ ఆందోళనలు నిర్వహించారు. ఖమ్మం ఎమ్మెల్యే కాంగ్రెస్ టికెట్ చే జారింది. పార్టీ సమీకరణాల దృష్ట్యా తుమ్మల నాగేశ్వర రావు ఇక్కడ నుంచి పోటీ చేసి విజయం సాధించడంతో మంత్రి అయ్యారు. ఎప్పుడు చిరునవ్వు చిందించే కాంగ్రెస్ నేత జావీద్(56) ఇక లేరనే విషయం కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర విషాదం నింపింది. ఖమ్మం-హైదరాబాద్ జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మం నగర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత మహమ్మద్ జావీద్ ప్రాణాలు కోల్పోయారు. సూర్యాపేట పిల్లలమర్రి శివారులో ఆయన ఒక్కరే ప్రయాణిస్తున్న వాహనం నియంత్రణ కోల్పోయి అతివేగంతో డివైడర్ ను ఢీ కొట్టి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తున్నారు. జావీద్ మృతితో ఖమ్మం కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర విషాదం నెలకొంది. కష్ట కాలంలో కాంగ్రెస్ కు అండగా నిలిచారు. తెరాస పాలనలో ప్రజా సమస్యలను ఎండగట్టారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అనుచరునిగా కొనసాగుతున్నారు. 7 ఏళ్ల పాటు పార్టీ ఖమ్మం నగర అధ్యక్షునిగా పని చేశారు. ఆ పదవి నుంచి ఆరు నెలల కిందటే పీసీసీ సభ్యునిగా నియమితులయ్యారు. భట్టి పీపుల్స్ మార్చ్ పాద యాత్ర విజయవంతం కోసం శ్రమించారు. సీఎం రేవంత్ రెడ్డి నాటి ప్రతి పక్ష నేత గా ఖమ్మం పర్యటనలో అండగా నిలిచారు. బుధవారం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పర్యటనను విజయ వంతం చేశారు. పార్టీ ఆఫీస్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగాన్ని పార్టీ శ్రేణులు గుర్తు చేసుకుంటున్నారు. ఆయన పార్టీకి చేసిన సేవలకు, త్యాగాలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎదో ఒక నామినేటడ్ పదవి వస్తుందని అందరు భావించారు. రేపు, మాపో రాష్ట్ర స్థాయి పదవి వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. అది నెరవేరకుండానే అనంతలోకాలకు వెళ్లడం పార్టీ శ్రేణుల్లో మరింత విషాదం నింపింది.
కాంగ్రెస్ పార్టీకి జావిద్ అందించిన సేవలు మరువలేనివి: డిప్యూటీ సీఎం భట్టి
కాంగ్రెస్ సీనియర్ నేత, ఖమ్మం కార్పొరేషన్ పార్టీ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ జావిద్ రోడ్డు ప్రమాదంలో మృతి పట్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. గత పది సంవత్సరాలపాటు పార్టీ కష్టకాలంలో ముందుండి జావిద్ సేవలు అందించారని గుర్తు చేశారు. ఖమ్మం నగర కార్పొరేషన్ మాజీ అధ్యక్షునిగా, ప్రస్తుతం పిసిసి కార్యవర్గ సభ్యునిగా, రాజీవ్ గాంధీ పంచాయతీ అభియాన్ కమిటీలో కీలక నేతగా, సేవాదళ్ రాష్ట్ర నాయకునిగా సుదీర్ఘకాలం పార్టీకి ఆయన అందించిన సేవలు మరువలేనివి అన్నారు. మహమ్మద్ జావిద్ కుటుంబానికి యావత్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని తెలిపారు. జావిద్ కుటుంబానికి ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. జావిద్ ఆత్మకు శాంతి కలగాలని ఆయన ప్రార్థించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్, ఖమ్మం డీసీసీ కార్పొరేషన్ అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి, మాజీ జిల్లా అధ్యకుడు దుర్గా ప్రసాద్, 50వ డివిజన్ కార్పొరేటర్ రాపర్తి శరత్ కుమార్ సంతాపం తెలియజేశారు. సంఘటన ప్రాంతానికి వెళ్లారు.
మంత్రి తుమ్మల విచారం
సూర్యాపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ పార్టీ ఖమ్మం నగర మాజీ అధ్యక్షులు మహ్మద్ జావీద్ అకాల మరణం చెందిన విషాదకర సంఘటనపై తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన విషయం తెలిసిన వెంటనే మంత్రి సూర్యాపేట పోలీసు అధికారులతో మాట్లాడి ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకున్నారు. జావీద్ మృతి పార్టీకి, ఖమ్మం నగరానికి తీరని లోటని పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ సంఘటనపై మంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు
నిబద్ధత కలిగిన నాయకుడిని కోల్పోయాo : మంత్రి పొంగులేటి
జావేద్ దుర్మరణం పట్ల తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. ఖమ్మం రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జావేద్, పార్టీ కోసం నిరంతరం అంకితభావంతో పనిచేశారని మంత్రి కొనియాడారు. ప్రజా సమస్యలపై స్పందించే గుణం, పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించే నేర్పు కలిగిన నాయకుడు జావేద్ అన్నారు. ఆయన మరణం కాంగ్రెస్ శ్రేణులకు తీరని లోటని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. జావేద్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని అల్లాను ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు ఈ తీరని దుఃఖాన్ని తట్టుకునే శక్తిని ప్రసాదించాలని మంత్రి తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి సంతాపం తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పాటు పనిచేసి, పేద ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సేవలందించిన జావిద్ మరణం కాంగ్రెస్ పార్టీకే కాకుండా బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు తీరనిలోటని పేర్కొన్నారు. బి.ఆర్.ఎస్. రాజ్య సభ సభ్యులు రవి చంద్ర, బీజేపీ రాష్ట్ర నేత దేవకీ వాసుదేవ రావు, బుధవారం రాత్రికి ఖమ్మం నగరంలోని వై ఎస్ ఆర్ నగర్ ఏరియాలోని రెడ్ హిల్స్ కాలనీకి జావీద్ పార్థివ దేహాన్ని తీసుకొచ్చారు. జావీద్ కు భార్య ఫమీదా ఫర్హీన్, పెద్ద కుమార్తె షహెల కుర్రత్ బీ టెక్ కంప్లీట్ అయి లా చదువుతున్నది. చిన్న కుమార్తె మదీనా సభాహత్ డాక్టర్ ఫైనల్ ఇయర్ చదువుతున్నది.

Comments
Post a Comment