జిల్లా గ్రంథాలయం అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలి అభివృద్ధి పనులను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
జిల్లా గ్రంథాలయం అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలి
నూతన భవనం నిర్మాణం నాణ్యతతో పూర్తి చేయాలి
అభివృద్ధి పనులను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
ఖమ్మం : జిల్లా గ్రంథాలయంలో చేపట్టిన అభివృద్ధి పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని, పాఠకులకు, విద్యార్దులకు అవసరమైన వసతుల కల్పనపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. బుధవారం పెవిలియన్ గ్రౌండ్ పక్కన ఉన్న జిల్లా గ్రంథాలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. లైబ్రరీ ఆవరణంలో నూతనంగా నిర్మిస్తున్న అదనపు భవనం, చుట్టూ ప్రహరీగోడ, టాయిలెట్ల నిర్మాణ పనులను అదనపు కలెక్టర్ శ్రీజ తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. నిర్మితమవుతున్న నూతన రెండు అంతస్ధుల భవనంతో పాటు విద్యార్ధులకు, అభ్యర్ధులు, పాఠకులకు కావాల్సిన వసతుల ఏర్పాట్లను ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనుసంధానంగా ప్రహారీ గోడ, గేట్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం గ్రంథాలయంలోని రీడింగ్ రూమ్ లలో తిరుగుతూ కావాల్సిన వసతుల అవసరాలను కలెక్టర్ గుర్తించారు. అక్కడ ఉన్న పాఠకులతో, పోటీ పరీక్షలకు సిద్దం అవుతున్న అభ్యర్ధులతో ముచ్చటించారు. ఏ పోటీ పరీక్షలకు సన్నద్దం అవుతున్నారు, ఎటువంటి పుస్తకాలు కావాలి, ఏమైనా అవసరాలు కావాలా వివరాలు అందిస్తే పది రోజుల్లో అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అభ్యర్దులు, విద్యార్థులకు అనువైన అధునిక వసతులతో చేపట్టిన నిర్మాణ పనులు నాణ్యతతో సకాలంలో పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సంబంధించి ప్రతి సంవత్సరం అప్ డేట్ అయిన పుస్తకాలను అందుబాటులో ఉంచాలని, ఎప్పటికప్పుడు పాతవి మార్చాలని, పాఠకులు యువకులతో చర్చించి పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యేందుకు ప్రతి విభాగం వారీగా అవసరమైన పుస్తకాల జాబితాను తయారు చేసి వెంటనే అందించాలన్నారు. విద్యార్థులు, యువత విలువైన కాలాన్ని వృథా చేసుకోకుండా, అదే సమయాన్ని గ్రంథాలయంలో గడపడం ద్వారా కొత్త కొత్త విషయాలు, విజ్ఞానం పెంచుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ సిబ్బంది భాస్కర్ రావు, అఖిల్, రవిబాబు తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment