కమనీయం రాములోరి కల్యాణం ..!
ఆకాశమంత పందిరి...!
భూదేవంత మండపం...!
వేదగోష పరిమళాలు...!
జయ జయ ద్వానాలు...!
ఇది..భద్రగిరినా...!?
దక్షిణఅయోధ్యపురినా...!?
భక్తుల సంభ్రమాశ్చర్యాలు...!
ఖచ్చితంగా 12 గంటలకు...!
సాంప్రదాయ అభిజిత్ లగ్నాన...!
రాములోరు సీతమ్మవారిని పరిణయం మాడారు...!
భద్రాచలంలో
శుక్రవారం జరిగిన రాములోరి కళ్యాణం వైభోగమే...!
ముగ్ధ మనోహరమే...!
కనులారా తిలకించిన భక్తజన హృదయాలు ఉప్పొంగాయి...! భద్రగిరి భక్తులతో పోటెత్తింది...!
భద్రాచలం: భద్రాచలం దివ్య క్షేత్రంలో మిథిలా ప్రాంగణంలో శుక్రవారం జరిగిన సీతారాముల పరిణయ వేడుక ఆబాల గోపాలాన్ని మరిపించింది. ఆధ్యాంతం భక్తులను కనువిందు చేసింది. శుక్రవారం వేకువజామునే రామాలయంలో తొలుత అర్చక స్వాములు స్వామివారికి సుప్రభాత సేవ జరిపారు. అనంతరం నివేదన గావించారు. మూలవర్లకు అభిషేకం జరిపారు. తొలుత ఆలయంలో ఏకాంతంగా ధృవమూర్తుల కళ్యాణం నిర్వహించారు. తదుపరి ఉత్సవమూర్తులకు అలంకారం గావించారు. స్వామివారిని పల్లకిపై కూర్చుండబెట్టి వేదమంత్రాలు,బాజా భజంత్రీలు, కోలాట దృశ్యాలు నడుమ ఊరేగింపు నిర్వహించి స్వామివారిని మిధిలా ప్రాంగణం వద్దకు తీసుకువచ్చారు. శిల్పకళా శోభిత కళ్యాణ మండపంపై స్వామివారిని కూర్చుండబెట్టి అర్చక స్వాములు కళ్యాణ తంతును నిర్వహించారు. తొలుత తిరు కళ్యాణ సంకల్పం గావించారు. విశ్వక్సేన పూజ జరిపి, పుణ్యాహవాచనం గావించారు. 24 అంగుళాల పొడవు గల 12 దర్బలతో అల్లిన దర్భతాడును సీతమ్మ వారి నడుముకు బిగించారు. రామయ్య కుడి చేతికి సీతమ్మ వారి ఎడమ చేతికి రక్షా సూత్రాలు తొడిగారు. స్వామివారికి సువర్ణ యజ్ఞోపవీతాన్ని ధరింప చేశారు. అనంతరం కన్యాదానం చేశారు. మధ్యాహ్నం 12 గంటలు సమీపించగానే అభిజిత్ లగ్నాన సీతారాముల వారి శిరస్సుపై జీలకర్ర బెల్లం ఉంచారు. జనకమహారాజు, దశరథ మహారాజు తరపున చేయించిన రెండు మంగళ సూత్రాలు శ్రీ భక్త రామదాసు వారు చేయించిన మరొక మంగళసూత్రంతో కలిపి మొత్తం మూడు సూత్రాలతో మాంగల్యధారణ గావించారు. తదుపరి తలంబ్రాల తంతు జరిపారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం సందర్భంగా భక్తులు శ్రీరామ జయరామ అంటూ దిక్కులు పిక్కటిల్లెలా జయ జయ ద్వానాలు చేశారు. దేశ నలుమూలల నుంచి తరలివచ్చిన అశేష భక్తజనంతో భద్రాచలం పోటెత్తింది. రామాలయ పరిసరాలు కిక్కిరిశాయి. కళ్యాణం అనంతరం భక్తులు భద్రాచల రామున్ని బారులు తీరి మరి దర్శించుకున్నారు. భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. స్థానికులు భక్తులకు అన్నదానం, పులిహోర,మజ్జిగ, మంచినీళ్లు,పానకం అందజేసి తమ భక్తి భావాన్ని చాటారు.రూ. 351 కోట్లతో ఆలయ విస్తరణ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సతీ సమేతంగా భద్రాచలంలో శుక్రవారం నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలో పాల్గొన్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో భద్రాచలం తరలివచ్చిన సీఎం తొలుత శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో స్వామి వారిని కుటుంబ సభ్యులతో దర్శించు కున్నారు. అనంతరం ఆలయం వద్ద రూ.351 కోట్లతో చేపట్టిన ఆలయ అభివృద్ధి తొలిదశ పనులకు భూమి పూజ నిర్వహించారు. అనంతరం మిధులా ప్రాంగణంకు చేరుకొని కళ్యాణాన్ని తిలకించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జి మంత్రి వాకిటి శ్రీహరి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, కొండా సురేఖ, ఎంపీ పోరిక బలరాం నాయక్, స్థానిక శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు, భద్రాచలం గ్రామ సర్పంచ్ పూనం కృష్ణ దొర, పలువురు న్యాయమూర్తులు, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా అయ్యర్, ఎండోమెంట్ కమీషనర్ హన్మంత రావు, జిల్లా కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజ్, పీఓ బి. రాహుల్, అదనపు కలెక్టర్లు విద్యా చందన, వేణుగోపాల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, భద్రాచలం రామాలయం ఈవో దామోదర్ రావు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Comments
Post a Comment