పాలకవర్గం గడువు ముగియడంతో కొందరు అధికారులు జూలు విదుల్చుతున్నారు. అక్రమాలకు తేర లేపారు. ఇటీవల డీజిల్, పెట్రోల్ కుంభకోణం మరువకముందే తాజాగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వద్ద అక్రమ వసూళ్లు వెలుగు చూసింది. ఓ యువ కార్పొరేటర్ పై ప్రత్యర్థుల తో కలిసి మెప్మా సిబ్బంది ఒకరు ఫిర్యాదు చేయడం నగరంలో చర్చనీయాంశంగా మారింది.
కమిషనర్ పేషీ సీసీ చేతివాటం
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇందిరమ్మ ఇండ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే మొదటి విడత ఇండ్ల పంపిణీ ప్రక్రియ పూర్తయి రెండవ విడత లబ్దిదారుల జాబితాను సిద్ధం చేయించింది. అయితే ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో అర్హుల గుర్తింపు ప్రక్రియను వార్డు ఆఫీసర్లకు అప్పగించారు. ఇదే అదునుగా భావించిన వారు ఇందిరమ్మ ఇల్లు కావాలంటే చేతులు తడపాల్సిందే అంటూ తమదైన పద్ధతిలో వసూళ్ల పర్వానికి తెర లేపారు. ఒక ఇంటికి రూ.20 వేల నుంచి రూ.50 వేల వసూళ్లకు పాల్పడ్డారు. ఓ వార్డు ఆఫీసర్ గా ఉన్న కమిషనర్ పేషీ సీసీ చేతివాటం ఆడియో, వీడియో ద్వారా బహిర్గతమైంది. రూ.20వేలు డిమాండ్ చేయడంతో రెండు రోజుల కిందట సస్పెన్షన్ కు గురయ్యారు. కలెక్టరేట్ లో విచారణ సాగుతోంది.
ఇంధన మాయలో ఏసీ స్థాయి అధికారి
పారిశుద్ధ్య విభాగం, ఇతర వాహనాలకు కలిపి కూపన్ లో నమోదు చేసిన వాహనానికి మాత్రమే ఇంధనాన్ని పోసేవారు. ఎన్నో ఏళ్లుగా పోస్తున్న జిల్లా జైలు ప్రభుత్వ పెట్రోల్ బంక్ కాదని ఏడాదిన్నరగా రాపర్తి నగర్ లోని ఓ పెట్రోల్ బంకు మార్చారు. కూపన్ లు ఇవ్వకుండా ఫోన్ కాల్ చేసి చెప్పడంతో బంకు నిర్వాహకులు ఇంధనం పోయడంతో అక్రమాలు కొనసాగాయి. 40 లీటర్ల కూపన్ తీసుకోవడం సగం పారిశుద్ధ్య వాహనంలో మిగిలినది క్యాన్ ద్వారా బయట విక్రయాలు జరిపారు. రూ.లక్షల్లో కార్పొరేషన్ ఖజానాకు బొక్క పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో ఓ అసిస్టెంట్ కమిషనర్ సహా సదరు సెక్షన్ ఉద్యోగి అయిన ఒక జూనియర్ అసిస్టెంట్, ఇద్దరు పొరుగు సేవల డ్రైవర్లు ఉన్నారు. కూపన్ జారీ చేసే ఉద్యోగిని సస్పెండ్ చేసిన 24 గంటల్లోనే ఆ ప్రక్రియ నిలిపివేయడం కార్పొరేషన్ కు పెద్ద మాయని మచ్చగా మారింది. నగర ప్రజలు ఇంటి పన్నులు, పంపు పన్నులు తదితర రూపాల్లో ట్యాక్స్ లు చెలిస్తున్నారు. వీటికి జవాబుదారిగా ఉండాల్సిన నగర పాలక సంస్థలోని కొందరు అధికారులు, సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారు.
కార్మికుల వేతనం కాంట్రాక్టర్ల జేబుల్లోకి..
ఖమ్మం నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల శ్రమ మాటల్లో చెప్పలేనిది. తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి పరుగు పరుగున వచ్చి విధుల్లో చేరి తిరిగి ఇంటికి వెళ్లే వరకు రెక్కలు ముక్కలు చేసుకుంటారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక్కో కార్మికుడికి నెలకు దాదాపు రూ. 16,500 చెల్లించాలి. వీరిని ప్యాకేజీల వారిగా సరఫరా చేస్తున్నందుకుగాను ఐదు శాతం సర్వీస్ టాక్స్ ను అదనంగా ఇస్తుంటారు. కానీ కొందరు కాంట్రాక్టర్లు కాసుల కక్కుర్తి తో పారిశుద్ధ్య కార్మికులకు చెల్లించాల్సిన వేతనాల్లో భారీగా కోతలు పెడుతూ జేబులు నింపుకుంటున్నారు. ఒక్కో కార్మికుడికి రూ.13000 లేదా రూ. 14 వేలకు మించి ఇవ్వడం లేదని సమాచారం. మిగిలిన డబ్బులను యదేచ్చగా స్వాహా చేస్తూ, ప్రశ్నించిన వారిని అర్ధాంతరంగా విధుల్లో నుంచి తీసిపారేస్తూ ఇస్టా రాజ్యాంగా వ్యవహరించడం విస్మయానికి గురిచేస్తుంది. ఈ విషయమై సమగ్ర దర్యాప్తు చేస్తే కాంట్రాక్టర్లు నెలవారీగా ఆర్జిస్తున్న అక్రమ సంపాదన గుట్టురట్టయ్యే అవకాశం లేకపోలేదు.
పారదర్శకత లేని పాలన
ఇంటి నిర్మాణం, ఇంటి నెంబర్ కేటాయింపు కార్యాలయంలో ప్రతి పని, ప్రతి ఫైలు ఆన్లైన్లో పారదర్శకంగా జరగాల్సి ఉండగా, కొందరు అధికార పార్టీ నాయకులు, అధికారుల తమ స్వలాభం కోసం ఈ-ఆఫీసు వ్యవస్థను పూర్తిగా డిసేబుల్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ-ఆఫీసు విధానంలో ఏ ఫైలు ఏ అధికారి వద్ద ఎంత కాలం పెండింగ్లో ఉందో డిజిటల్ ట్రాకింగ్ ద్వారా ఇట్టే తెలిసిపోతుంది. మాన్యువల్ విధానం అమలు చేయడం వల్ల అధికారులు ఫైళ్లను రోజుల తరబడి దాచిపెట్టడం, అవినీతికి ఆస్కారం ఉన్న ఫైళ్లను పూర్తిగా మాయం చేయడం సులభంగా మారింది. డిజిటల్ సంతకాలతో కూడిన ఈ-ఆఫీసులో తేదీలు మార్చడం అసాధ్యం. కానీ ప్రస్తుత మాన్యువల్ విధానంలో అధికారులకు, కాంట్రాక్టర్లకు అనుకూలంగా పాత తేదీలతో ఫైళ్లు సృష్టించి, టెండర్లు లేకుండానే కోట్లాది రూపాయల పనులు కట్టబెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కార్పొరేషన్ ఆఫీస్ ఎదుటే అక్రమ నిర్మాణాలు, మురుగు కాల్వలు ఆక్రమించి ఏర్పాటు చేసిన దుకాణాలు ఏర్పాటు చేస్తున్న టౌన్ ప్లానింగ్ విభాగం దృతరాష్ట్ర పాలన సాగిస్తోంది.
మెప్మా.. చెప్మా
కార్పొరేషన్ లోని మెప్మా విభాగంపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఖమ్మం నగరంలో సుమారు 40 వేల మంది మహిళా గ్రూప్ సభ్యులు ఉన్నారు. 5 లక్షల జనాభాకు ఈ సంఖ్య తక్కువే. వీటిని పర్యవేక్షించాల్సిన మెప్మా విభాగం రాజకీయాలు చేస్తోంది. సత్తుపల్లిలో పని చేయాల్సిన ఓ అధికారి ఇక్కడ మకాం వేసి ఇద్దరు సీఓలతో (ముగ్గురు) కలిసి తమకు నచ్చిన ఆర్పీలు అక్రమాలకు పాల్పడిన పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్ హెచ్ జి రుణాలకు లక్షకు ఒక రేటు ఫిక్స్ చేసి గత ఆరు నెలలుగా ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్న మెప్మా పిడి మౌనం వెనుక అర్ధం కావడంలేదు. పిడి తర్వాత డి ఎం సి అధికారి ఉన్నా ఆమెను డమ్మీ చేశారు. రూ.లక్షల్లో స్త్రీ నిధి రుణాల బకాయిలు, ఇతర బ్యాంక్ ల్లో ఎన్ పి ఏ లు ఉన్న పని చేయని ఆర్పీలకు ఆ ముగ్గురు అండగా నిలవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఓ అటెండర్ ను వసూళ్ల కోసం వినియోగిచడం విశేషం. ఓ యువ కార్పొరేటర్ పై ప్రత్యర్థుల తో కలిసి మెప్మా సిబ్బంది ఒకరు అక్రమ ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. రోజు రోజుకు గాడి తప్పుతున్న ఖమ్మం బల్దియా పై అమాత్యులు ప్రత్యేక దృష్టి సారించాలని నగర ప్రజలు కోరుతున్నారు. త్వరలో జరిగే కార్పొరేషన్ ఎన్నికల పై పాలన ప్రభావం చూపనుంది.
.jpg)
Comments
Post a Comment