ఓ నేత స్నేహ హస్తంపై భారీ ఆరోపణలు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సెక్రటరీ బదిలీ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఓ చేత్తో బదిలీ ఆర్డర్ ఇచ్చి మరో వైపు ఆన్ డ్యూటి(ఓడి) ఉత్తర్వులు ఇవ్వడంపై రాజకీయ, వ్యాపార, మార్కెట్ వర్గాల్లో తీవ్ర విస్మయం కలిగిస్తోంది. నిత్యం అవినీతి ఆరోపణలతో సహవాసం చేస్తున్న సదరు సెక్రటరీకి ప్రభుత్వం ఏకంగా ఐదోసారి పొడిగింపు ఉత్తర్వులు ఇవ్వడం వెనుక ఉన్న మతలబు ఏమిటన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సాధారణంగా ఏ ప్రభుత్వ అధికారికైనా బదిలీలు, ఒకట్రెండు సార్లు పొడిగింపులు సహజం. కానీ, ప్రస్తుత సెక్రటరీకి ప్రభుత్వం ఇప్పటికి ఏకంగా ఐదుసార్లు పొడిగింపు ఉత్తర్వులు ఇవ్వడం మార్కెట్ వర్గాలతో పాటు ఉన్నతాధికారులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. ఇంతలా బదిలీలను అడ్డుకుంటూ, పదే పదే పొడిగింపులు తెచ్చుకుంటున్న ఆ సెక్రటరీ వెనుక ఉన్న అంతర్యం ఏమిటనేది ఎవరికీ అంతుపట్టని విషయంగా మారింది. ఆయన తీరుపై రైతులు, రైతు సంఘాల నుంచి తీవ్ర స్థాయి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదే విధంగా సెక్రటరీ పని తీరుపై మార్కెట్లో జరిగే ఆర్డీలు, జీరో దందాలపై (పన్ను ఎగవేత వ్యాపారం) అధికారి కనీస దృష్టి సారించడం లేదనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. రైతుల సంక్షేమం చూడాల్సిన బాధ్యతను గాలికి వదిలేసి, ప్రైవేటు వ్యాపారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి అంతే కాకుండా వ్యాపారులతో కుమ్మక్కై తప్పుడు కాటాలు వేస్తూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్న దడవాయిలపై (తూకం వేసే కార్మికులు) ఫిర్యాదులు వస్తున్నా వారిపై కేవలం నామమాత్రపు చర్యలు తీసుకుని వదిలేస్తున్నారనే ఆరోపణలున్నాయి. సొంత వ్యాపారాలపై ఉన్న శ్రద్ధ, మార్కెట్ అభివృద్ధిపై కానీ, రైతులకు జరిగే అన్యాయంపైగానీ సెక్రటరీకి చిత్తశుద్ధి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నేతలు ఎవరు?
నిత్యం ఇన్ని అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ, వివాదాస్పదంగా మారిన ఈ సెక్రటరీని బదిలీ కాకుండా కాపాడుతున్న ఆ అధికార పార్టీ నాయకులు ఎవరనేది ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రైతుల ఉసురు తగులుతున్నా పట్టించుకోకుండా, కేవలం మామూళ్లకు, పైరవీలకు తలొగ్గి సదరు అధికారికి అధికార పార్టీ పెద్దలు అండగా నిలవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మార్కెట్ ప్రజా ప్రతినిధిని డమ్మీ చేసి ఓ నేత వారాంతపు వసూళ్లపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. సాక్షాత్తు కర్షక మంత్రి జిల్లాలోనే మార్కెట్ వసూళ్ల దందాపై ఫిర్యాదులు రావడం గమనార్హం. రైతులకు న్యాయం జరగాలన్నా, మార్కెట్ గాడిన పడాలన్నా.. ఉన్నతాధికారులు లేదా ప్రభుత్వ పెద్దలు తక్షణమే స్పందించి ఈ ‘పొడిగింపుల’ వెనుక ఉన్న మాయాజాలంపై, మార్కెట్లో జరుగుతున్న అవినీతి దందాపై సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మార్కెట్ వర్గాలు కోరుతున్నాయి.
Comments
Post a Comment