ఖమ్మం మున్సి''పల్స్'' కార్పొరేషన్ రసవత్తరం
ఖమ్మం: "ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందట" చందంగా ఉంది జిల్లా కేంద్రం అయిన ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ లోని రాజకీయ నాయకుల పరిస్థితి. ఇక్కడి పాలకవర్గం గడవు ఈ నెల మొదటి వారంతో ముగిసింది. ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది. ఎన్నికలు ఎప్పుడనేది స్పష్టత లేదు. హైదరాబాద్, వరంగల్ కార్పొరేషన్ లతో పాటు జరుగుతాయనేది ప్రచారం జరుగుతోంది. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ గా మారడంతో రెండు సార్లు బిఆర్ఎస్ మేయర్లు పని చేశారు. మొట్ట మొదటి మేయర్ గా డాక్టర్ పాపాలాల్ వ్యవహరించారు. ఆ తర్వాత మేయర్ గా నీరజ పని చేశారు. ఆమె కారు పార్టీ మేయర్ గా బాధ్యతలు చేపట్టినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఆమెనే కొనసాగించారు. పదేళ్ల పాటు టి(బి)ఆర్ఎస్ పాలకులకు ఎదురొడ్డి నిలిచిన కాంగ్రెస్ నాయకులు కార్పోరేటర్లుగా పార్టీ అవకాశం కల్పిస్తుందని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లో చేరిన నేతలు, ప్రభుత్వం వచ్చిన తర్వాత చేరిన ఇతర పార్టీ నేతలు సైతం కార్పొరేటర్ టికెట్లు ఆశిస్తున్నారు. కార్పొరేషన్ లో మొత్తం 60 డివిజన్లకు గాను 57 డివిజన్లు ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ పరిధి(మంత్రి తుమ్మల నాగేశ్వరావు)లో ఉన్నాయి. మరో మూడు డివిజన్లు పాలేరు నియోజకవర్గం(మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి) పరిధిలో ఉన్నాయి. అధికార పార్టీలో ప్రతి డివిజన్ లో పాత, కొత్త నేతలతో కలిపి నలుగురు, ఐదుగురు నేతలు పోటీలో ఉంటున్నారు. జిల్లా కేంద్రం కావడంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తో పాటు ఇతర నేతల అనుచరులు సైతం కార్పొరేషన్ టికెట్ రేసులో ఉంటున్నారు.
మేయర్ మాదే.. కార్పొరేటర్ల అ''టెన్షన్''
బతుకమ్మకు పంచాల్సిన ప్రభుత్వ ఇందిరమ్మ చీరలను సైతం ఇప్పటికీ బల్దియాలో పంపిణీ కొనసా..గుతుంది. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఎన్నికల సమయం కాబట్టి ఇంకా పంపిణీ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మామిడి కాయల పచ్చడి సీజన్ కావడంతో కొందరు ఆశావాహు లు తమ డివిజన్ లో ఇంటింటికి పచ్చడి లేదా మామిడి కాయలను పంపిణీ చేస్తున్నారు. మరికొందరు చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం తొలిసారి మేయర్ ఎన్నికలు వస్తుండడంతో మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని పావులు కదుపుతోంది. ఖమ్మం 3 టౌన్ ఏరియా వంటి బలం లేని చోట ఇతర పార్టీ నేతలను హస్తం గూటికి చేర్చుకుంటుంది. కాంగ్రెస్ హవాను అడ్డుకునేందుకు బిఆర్ఎస్ నేతలు పలు డివిజన్ ల లో చాప కింద నీరులా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఉన్న ఒక కార్పొరేటర్ సంఖ్య ను పెంచుకోవాలని కమలం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. గతంలో ఉన్న పూర్వ వైభవం కోసం సిపిఎం, సిపిఐ కసరత్తులు చేస్తోంది. ఇండిపెండెంట్, ఇతర పార్టీలు సైతం కార్పొరేషన్ లో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మేయర్ స్థానం గత రిజర్వేషన్ మాదిరిగా జనరల్ మహిళా అయింది. అన్ని వర్గాల మహిళా నేతలకు అవకాశం ఉంది. అయితే జనరల్ కాబట్టి తమ సామాజిక వర్గానికే దక్కతుందని ఓ వర్గం ధీమాగా ఉంది. అమాత్యుని వద్ద ఉన్న ఓ నేత సతీమణి తాజా మాజీ మహిళా కార్పొ రేటర్ సహా పలువురు మహిళా నేతలు నగర ప్రథమ పౌరురాలు కావాలని రాజకీయాలు చేస్తున్నారు. డివిజన్ ల లో రిజర్వేషన్ లు మారుతుండడంతో కార్పొ రేటర్ ఆశావహులు తమకు అనుకూలమైన డివిజన్ల పై దృష్టి సారించారు. ప్రస్తుత సీజనల్ పాలిట్రిక్స్ తో త్వరలో జరిగే ఖమ్మం నగర మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పటి నుంచే రసవత్తరంగా మారింది.


Comments
Post a Comment