వైరా ఎంవీఐ కార్యాలయంపై ఏసీబీ దాడులు
ఎంవీఐ ఏ.వరప్రసాద్ ను అరెస్టు
ఖమ్మం : వైరా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ కాంట్రాక్టర్ నుంచి నగదు తీసుకుంటున్న వైరా ఎంవీఐ పర్సనల్ అసిస్టెంట్ రాజశేఖర్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఖమ్మం ఏసీబీ డీఎస్పీ వై రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.... ఖమ్మం జిల్లా పెనుబల్లి కి చెందిన ఓ కాంట్రాక్టర్ 5 టిప్పర్లు, 4 ట్రాక్టర్లతో ఖమ్మంకు నిరంతరం ఇటుక రవాణా చేస్తున్నారు. వైరా మీదుగా వాహనాలు ఖమ్మం వెళ్లేందుకు ఎంవీఐ లంచం డిమాండ్ చేశారని ఏసీబీ డిఎస్పీ తెలిపారు. నెలకు ఒక్కో టిప్పర్ కు రూ.3200, ఒక్కో ట్రాక్టర్ కు రూ.2200 చొప్పున లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 5 టిప్పర్లు, 4 ట్రాక్టర్లకు సంబంధించి నెలకు రూ.24800 ఇవ్వాలని సదరు కాంట్రాక్టర్ పై ఒత్తిడి తెచ్చారు. అయితే ఆయన అందుకు నిరాకరించటంతో ఇటీవల సదరు కాంట్రాక్టర్ ట్రాక్టర్ ను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ఆ తర్వాత కూడా తమకు నెలవారీ మామూలు ఇవ్వాలని ఎంవీఐ పట్టుపట్టారని డీఎస్పీ పేర్కొన్నారు. దీంతో బాధితుడు ఏసీబీను ఆశ్రయించారు. మంగళవారం సాయంత్రం సదరు బాధితుడు రూ.24800 నగదును ఎంవీఐ పర్సనల్ అసిస్టెంట్ రాజశేఖర్ కు అందచేస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నగదు పట్టుకున్న వెంటనే రాజశేఖర్ అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం ఏసీబీ అధికారులు ఎంవీఐ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యాలయంలో అనధికారికంగా ఉన్న అవినీతి సొమ్ము రూ.52800 లను గుర్తించి సీజ్ చేశారు. వైరా ఎంవీఐ వరప్రసాద్ ను అరెస్టు చేసి వరంగల్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరిచేందుకు తరలించారు. పరారీలో ఉన్న రాజశేఖర్ కోసం ఏసీబీ అధికారులు గాలిస్తున్నారు.

Comments
Post a Comment